టాస్‌ గెలిచిన టీమిండియా

5 Jan, 2020 18:39 IST|Sakshi

గుహవాటి: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ బార్సపరా స్టేడియంలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక్కడ భారత్‌ ఆడిన చివరి మ్యాచ్‌లో ఛేజింగ్‌ చేసి గెలవడంతో భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. ఇదే విషయాన్ని కోహ్లి స్పష్టం చేశాడు. ఇక మలింగా మాత్రం తొలుత బ్యాటింగ్‌ చేయడం సంతోషంగా ఉందన్నాడు. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత్‌కు సవాల్‌ విసురుతామన్నాడు. ఈ ట్రాక్‌ సెకాండాఫ్‌లో విపరీతమైన మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నాడు.

కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలని టీమిండియా యోచిస్తోంది. గడిచిన ఏడాదిని విజయంతో ముగించిన కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ అదే ప్రదర్శనను లంకేయులతో టీ20 సిరీస్‌లోనూ రిపీట్‌ చేయాలని భావిస్తోంది. తొలి టీ20ని గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మరొకవైపు శ్రీలంక కూడా విజయంతో శుభారంభం చేయాలని చూస్తోంది.

12 ఏళ్ల కిత్రం విరాట్‌ కోహ్లి  అరంగేట్రం చేసినప్పటి నుంచీ భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ (మూడు ఫార్మాట్లలోనూ)లన్నింటిలోనూ శ్రీలంక ఓడింది. అప్పటి నుంచి వరుసగా 16 మ్యాచ్‌లలో ఆ జట్టు పరాజయం పాలైంది. ఒక్క 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో మాత్రం గెలిచింది. అటు టి20 కెపె్టన్‌గా మలింగ రికార్డు పేలవం గా ఉంది. అతని సారథ్యంలో ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఓడితే ఒకటే గెలిచింది!  ఈ నేపథ్యంలో పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఎక్కువే ఉన్నప్పటికీ భారత్‌ను స్వదేశంలో ఓడించడం లంకకు కాస్త కష్టమే.అయితే టాస్‌ వేసిన తర్వాత వర్షం పడింది. దాంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దాంతో మ్యాచ్ ఆరంభం కావడానికి అంతరాయం ఏర్పడింది.

భారత జట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనీ, బుమ్రా

శ్రీలంక జట్టు
లసిత్‌ మలింగా(కెప్టెన్‌), దినుష్కా గుణతిలకా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్‌ పెరీరా, ఒషాడో ఫెర్నాండో, భానుక రాజపక్సే, ధనంజయ డిసిల్వా, షనకా, ఇసురు ఉదాన, వానిందు హసరంగా, లహిరు కుమార

మరిన్ని వార్తలు