ఓటమిపై స్పందించిన పొలార్డ్‌

7 Dec, 2019 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఓడిపోవడంపై వెస్టిండీస్‌ సారథి కీరన్‌ పొలార్డ్‌ అసహనం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఈ ఫార్మట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో భారీ ఛేజింగ్‌ మ్యాచ్‌గా నిన్నటి మ్యాచ్‌ నిలవడం విశేషం. ఇక మ్యాచ్‌ అనంతరం కరేబియన్‌ సారథి పొలార్డ్‌ మాట్లాడుతూ.. క్రమశిక్షణ లేని బౌలింగ్‌, వ్యూహాలు అమలు చేయడలో వైఫల్యం చెందడంతోనే ఓటమి చవిచూసినట్లు పేర్కొన్నాడు. 

‘పిచ్‌ గురించి ఏం మాట్లాడను. ఎందుకంటే టీ20 ఫార్మట్‌కు ఇలాంటి మైదానాలే కావాలి. మా బ్యాట్స్‌మన్‌ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో భారీ స్కోర్‌ సాధించగలిగాం. కానీ మా బౌలర్ల ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనికంగా లేదు. కనీస ప్రాథమిక సూత్రాలను కూడా మా బౌలర్లు పాటించలేదు. ఇందుకు 23 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడమే ఉదాహరణ. అంతేకాకుండా దాదాపు 15 వైడ్‌లు వేశారు. తొలి పది ఓవర్ల వరకు గేమ్‌ మా చేతిలోనే ఉందనిపించింది. అయితే కోహ్లి దాటిగా ఆడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ఈ విషయంలో కోహ్లి గొప్పతనం ఎంత ఉందో.. మా బౌలర్ల వైఫల్యం అంతే ఉంది. అయితే మరో రెండు మ్యాచ్‌లు ఉండటంతో ఈ లోపాలన్నింటిపై దృష్టి సారిస్తాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’అంటూ పొలార్డ్‌ పేర్కొన్నాడు. 

చదవండి: 
విరాట్‌ కోహ్లి సింహ గర్జన..

మరిన్ని వార్తలు