ఆ గేమ్‌ అంటూ ఏమీ ఉండదు: రిషభ్‌

16 Dec, 2019 12:46 IST|Sakshi

చెన్నై: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. ఇప్పటివరకూ చాలా మ్యాచ్‌లు ఆడినా ఎట్టకేలకు వన్డే ఫార్మాట్‌లో తొలి అర్థ శతకం సాధించాడు. వెస్టిండీస్‌ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ 71 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో తంటాలు పడుతున్న రిషభ్‌ పంత్‌ ఒత్తిడిని జయించి బ్యాట్‌తో మెరిశాడు. దాంతో పంత్‌ తన నేచురల్‌ గేమ్‌తో ఆకట్టుకున్నాడనే వినిపించింది.  

దానిలో భాగంగా  పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో రిషభ్‌కుఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ అసలు నేచురల్‌ గేమ్‌ అనేది ఏమీ ఉండదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే క్రికెటర్‌ చేసే పని. జట్టు పరిస్థితిని, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ డిమాండ్‌ను బట్టి మనం ఆడాల్సి మాత్రమే ఉంటుంది. మ్యాచ్‌ను అంచనా వేసుకుంటూ ఆడితే అంతకంటే గేమ్‌ ఏమీ ఉండదు. అటువంటప్పుడే మనకు సక్సెస్‌ అనేది ఉంటుంది. ఆటగాడిగా నిరూపించుకోవడంపైనే నేను దృష్టి సారించా. మనల్ని మనం నమ్మితేనే రాణించగలం. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అవసరాలకు తగ్గట్టు ఆడటమే నా ముందున్న లక్ష్యం.

కొన్ని సందర్భాల్లో అభిమానుల్ని వచ్చే మద్దతు కూడా చాలా కీలకంగా ఉంటుంది. నేను ఎప్పుడూ భారీ వ్యక్తిగత స్కోర్లు నమోదు చేయాలనే అనుకుంటా. నా గేమ్‌ను ఎప్పటికప్పుడూ మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతా. జట్టు కోణంలో చూస్తే నేను నా టీమ్‌కు ఎలా సాయపడగలను అనేదే ఆలోచిస్తా’ అని రిషభ్‌ పేర్కొన్నాడు.  విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి పంత్‌ 114 పరుగుల నాల్గో వికెట్‌ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆరంభంలోనే టీమిండియా కీలక వికెట్లను చేజార్చుకున్నా పంత్‌-అయ్యర్‌ల జోడి ఆకట్టుకుంది. అయ్యర్‌ 70 పరుగులు సాధించాడు. దాంతో టీమిండియా 288 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ ముందుంచుంది. కాకపోతే హెట్‌మెయిర్‌(139), షాయ్‌ హోప్‌(102)లు విశేషంగా రాణించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఇక్కడ చదవండి:

అది ఎలాగో నాకే అర్థం కావడం లేదు: హెట్‌మెయిర్‌

ఆ విషయం మాకు తెలుసు: పొలార్డ్‌

మరిన్ని వార్తలు