నమన్ ఓజా డబుల్ సెంచరీ

8 Jul, 2014 01:21 IST|Sakshi
నమన్ ఓజా డబుల్ సెంచరీ

భారత్ ‘ఎ' 475/9 డిక్లేర్డ్  ఆస్ట్రేలియా ‘ఎ' 126/6
బ్రిస్బేన్: నమన్ ఓజా (250 బంతుల్లో 219 నాటౌట్; 29 ఫోర్లు, 8 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో పాటు బౌలర్లు నిలకడగా రాణించడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ' పట్టు బిగించింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం భారత్ ‘ఎ' తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

అనంతరం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఫిల్ హ్యూస్ (34)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ మరో 349 పరుగులు వెనుకబడి ఉంది.
 
ఓజా దూకుడు...
ఓవర్‌నైట్ స్కోరు 304/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్‌ను ఓజా నడిపించాడు. సోమవారం భారత్ స్కోరుకు మరో 171 పరుగులు చేరితే... అందులో ఓజా ఒక్కడే 137 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ ఆసాంతం భారీ షాట్లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ సెంచరీ, డబుల్ సెంచరీలను సిక్సర్లతోనే పూర్తి చేసుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు