విశాఖ:ఇంగ్లండ్ తో ఇక్కడ డా.వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. ఇంకా భారత్ విజయానికి 3 వికెట్లు అవసరం కాగా, ఇంగ్లండ్ గెలుపుకు 263 పరుగులు అవసరం. ఈ మ్యాచ్ లో ఏమైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోవడం ఇంగ్లండ్ కు ఇక కష్టంగానే కనిపిస్తోంది.
87/2 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఈ రోజు తొలి సెషన్ ఆదిలో డకెట్ డకౌట్ గా పెవిలియన్ చేరితే, ఆ తరువాత మొయిన్ అలీ(2), బెన్ స్టోక్స్(6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు.ఆపై ఓవర్ నైట్ ఆటగాడు జో రూట్(25) కూడా నిష్క్రమించాడు.ఇక ఏడో వికెట్ గా రషిద్(4)అవుటయ్యాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.డకెట్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపితే, అలీని జడేజా అవుట్ చేశాడు. జయంత్ యాదవ్ కు స్టోక్స్ చిక్కగా, రూట్, రషిద్లను షమీ పెవిలియన్ పంపాడు.