వన్డేనే కానీ... ధనాధన్‌

23 Jan, 2020 02:58 IST|Sakshi

231 లక్ష్యాన్ని 29.3 ఓవర్లలో ఛేదించిన భారత్‌ ‘ఎ’

తొలి అనధికారిక వన్డేలో కివీస్‌ ‘ఎ’పై జయభేరి

లింకన్‌ (న్యూజిలాండ్‌): న్యూజిలాండ్‌ ‘ఎ’తో వన్డే మ్యాచ్‌ ఆడినప్పటికీ భారత్‌ ‘ఎ’ బ్యాట్స్‌మెన్‌ ధనాధన్‌ మెరుపులు మెరిపించారు. దీంతో తొలి అనధికారిక వన్డేలో భారత్‌ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 30వ ఓవర్‌ ముగియక ముందే లక్ష్యాన్ని చకచకా ఛేదించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా కివీస్‌ ‘ఎ’ 48.3 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (49; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ బ్రూస్‌ (47; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ (3/33) ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు.

ఖలీల్‌ అహ్మద్, అక్షర్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ ‘ఎ’ 29.3 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ సామ్సన్‌ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్‌) దడదడలాడించారు. విజయ్‌ శంకర్‌ (20 నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా (15 నాటౌట్‌) కూడా రాణించారు. నీషమ్‌కు 2 వికెట్లు దక్కాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో అనధికారిక వన్డే రేపు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.  

>
మరిన్ని వార్తలు