ఆసీస్‌ను ఓడించిన భారత్‌

8 Feb, 2020 11:18 IST|Sakshi
స్మృతి మంధాన

మెల్‌బోర్న్‌: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు రికార్డు ఛేజింగ్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమిష్టిగా రాణించి చివరి ఓవర్‌లో గెలిచింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(55; 48 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. 16 ఏళ్ల షెఫాలి వర్మ బ్యాట్‌తో చెలరేగింది. 18 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీ కోల్పోయింది. రోడ్రిగ్స్‌(30), కౌర్‌(20) నాటౌట్‌గా నిలిచారు. భారత మహిళల జట్టుకు టి20ల్లో ఇదే అతిపెద్ద ఛేజింగ్‌ కావడం విశేషం.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. గార్డ్‌నర్‌ విజృంభించి ఆడి 57 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసింది. లానింగ్‌ 37 పరుగులతో ఫర్వాలేదనిపించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు గెలిచి, రెండు ఓడింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచిన ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

>
మరిన్ని వార్తలు