వంద పరుగులకే 5వికెట్లు; కష్టాల్లో భారత్‌

21 Feb, 2020 08:17 IST|Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు తడబడుతున్నారు.  ప్రసుత్తం టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అజింక్యా రహానే 36 పరుగులు, రిషబ్‌ పంత్‌ 6 పరుగులతో క్రీజలో ఉన్నారు. అంతకుముందు టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఏంచుకోగా..  పిచ్‌పై ఉన్న తేమను కివీస్‌ బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌లు కివీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా  16 పరుగుల వద్ద పృథ్వీ షాను టిమ్‌ సౌథీ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు వచ్చిన చటేశ్వర్‌ పుజార (11) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. (ఇక్కడ 320 మంచి స్కోరు: రహానే)


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జేమిసన్‌ బౌలింగ్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో 40 పరుగులకే 3వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే  మయాంక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. దీంతో 79 పరుగుల వద్ద టీమిండియా లంచ్‌కు వెళ్లింది.  లంచ్‌ విరామం అనంతరం జట్టు స్కారు 88 పరుగుల వద్ద ఉన్నప్పుడు మయాంక్‌  బౌల్ట్‌ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రహానే, అగర్వాల్‌ మధ్య 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.  అనంతరం క్రీజలోకి హనుమ విహారి 7 పరుగులు చేసి జేమిసన్‌ బౌలింగ్‌లో అవుట్‌ కావడంతో 101 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కాగా కివీస్‌ బౌలర్లలో జేమిసన్‌ 3, బౌల్ట్‌ , సౌథీ చెరో వికెట్‌ తీశారు. 

>
మరిన్ని వార్తలు