ఆ జట్టు డామినేషన్‌ పీక్స్‌లో ఉంది.. కానీ

17 Feb, 2020 16:34 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా బౌలింగ్‌ యూనిట్‌పై ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు స్టీవ్‌ వా ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొంతకాలంగా భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ ఆధిపత్యం పీక్స్‌లో ఉందని కొనియాడాడు. ప్రధానంగా భారత్‌ పేస్‌ బౌలర్లు చెలరేగిపోతున్న తీరును ప్రశంసించాడు. కానీ ఆ జట్టు బౌలింగ్‌ డామినేషన్‌ అనేది స్వదేశానికి పరిమితమై పోయిందనే విషయాన్ని ప్రస్తావించాడు‘ ప్రస్తుత టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ వరల్డ్‌లోనే అత్యుత్తమంగా ఉంది. ఆ జట్టు పేసర్లు విజృంభించి బౌలింగ్‌ చేస్తూ విజయాలు సాధించిపెడుతున్నారు. ఆ డామినేషన్‌ అనేది సొంత గడ్డపైనే కావడం కాస్త ఆందోళన పరిచే అంశం. ఈ విషయంలో ఆసీస్‌ బౌలర్లే ముందంజలో ఉన్నారు. మా పేస్‌ బౌలింగ్‌ ఎక్కడైనా సత్తాచాటగలదు. ఆసీస్‌-టీమిండియా జట్లలో భీకరమైన బౌలర్లు ఉన్నారు. టెస్టుల్లో 20 వికెట్లను సాధించే సత్తా ఇరు జట్ల బౌలర్లలోనూ ఉంది. (ఇక్కడ చదవండి: రాహుల్‌ 2.. కోహ్లి 10)

కానీ భారత్‌ కంటే ఆసీస్‌ బౌలింగే బెటర్‌ అని చెప్పగలను. స్వదేశంలోనే విదేశాల్లోనూ రాణించే బౌలర్లు మా జట్టు సొంతం. ఇక్కడ టీమిండియా బౌలింగ్‌ ప్రతిభ స్వదేశానికి పరిమితమై పోతున్నట్లు కనబడుతోంది. ప్రత్యేకంగా భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ఆ పేసర్ల బౌలింగ్‌ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఆసీస్‌ ఎంత ప్రమాదకరమో అదే తరహాలో భారత్‌లో టీమిండియా బౌలింగ్‌లో అద్భుతాలు చేస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ వచ్చినప్పుడు మాత్రం మా జట్టు బౌలింగ్‌ యూనిట్‌ బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌ వైవిధ్యం సూపర్‌. అయితే అతని బౌలింగ్‌ను కాస్త మార్చుకోవాలని చాలా మంది కోచ్‌లు చెబుతున్నారు. బౌలింగ్‌లో వేగం పెంచకపోతే బుమ్రా వికెట్లు తీయడం కష్టమని అంటున్నారు. అతన్ని సహజసిద్ధమైన బౌలింగ్‌ చేయనివ్వండి. అతని బౌలింగ్‌ యాక్షన్‌ అసాధారణం’ అని స్టీవ్‌ వా పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం)

మరిన్ని వార్తలు