'టీమిండియాకు ఇదే మంచి ఛాన్స్‌'

4 Jan, 2018 15:43 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టుపై దిగ్గజ ఆటగాడు ఎరపల్లి ప్రసన్న ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటివరకూ చూసిన భారత జట్ల పరంగా చూస్తే ప్రస్తుత విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని జట్టే అత్యంత పటిష్టంగా ఉందంటూ కొనియాడాడు. గత 60-70 ఏళ్లలో చూస్తే బౌలింగ్‌ విభాగంలో ఇప్పటి భారత జట్టు చాలా మెరుగైందంటూ కితాబిచ్చాడు.

ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ఒక ఎటాకింగ్‌ జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతకుముందు ఎప్పుడూ ఇంత పటిష్టంగా ఉన్న భారత జట్టును నేను చూడలేదు. అయితే తుది జట్టుతో సఫారీలతో పోరుకు సిద్దమయ్యేటప్పుడు ఐదు బౌలర్లతో దిగితేనే మంచిది. మ్యాచ్‌ను గెలవాలంటే ఐదుగురి బౌలర్ల ఫార్ములా అవసరం. అదే సమయంలో అదనపు బ‍్యాట్స్‌మన్‌ కూడా ఉంటే బాగుంటుంది. దక్షిణాఫ్రికా గడ్డపై మొదటిసారి సిరీస్‌ను సాధించడానికి భారత్‌కు ఇంతకంటే మంచి ఛాన్స్‌ రాదు. అంతటి సమతుల్యం భారత జట్టులో కనబడుతోంది. ఆటగాళ్లు కూడా సానుకూల ధోరణితో ఉన్నారు. ఇందుకు టీమిండియా ఆడిన గత సిరీస్‌లే ఉదాహరణ. సఫారీలపై తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్లు 350 పరుగులు చేస్తే సగం మ్యాచ్‌ను గెలిచినట్లే' అని ప్రసన్న విశ్లేషించాడు. శుక్రవారం కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు