రెండో స్థానంలోనే భారత్

1 May, 2015 01:25 IST|Sakshi

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండో స్థానంలో కొనసాగుతుండగా... ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా తమ నంబర్‌వన్ స్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆస్ట్రేలియా (129 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో నిలువగా, భారత్ (117) ఆసీస్‌ను అనుసరించింది. 2017 జూన్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

ఇందులో పాల్గొనే జట్ల కోసం ఈ ఏడాది 30 సెప్టెంబర్‌ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఆ రోజు వరకు ర్యాంకుల్లో టాప్-8లో ఉన్న జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ 8వ, పాకిస్తాన్ 9వ స్థానాల్లో ఉన్నాయి. బంగ్లా దీనిని నిలబెట్టుకోగలిగితే పాక్‌ను వెనక్కి నెట్టి 2006 తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవుతుంది. మరోవైపు టి20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ భారత్ రెండో స్థానంలోనే ఉంది.

మరిన్ని వార్తలు