'ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతాం'

11 Jan, 2016 14:28 IST|Sakshi

పెర్త్: ఆస్ట్రేలియాతో మంగళవారం జరుగనున్న తొలి వన్డేలో తాము అనుసరించబోయే బౌలింగ్ వ్యూహం ఏమిటో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చూచాయగా వెల్లడించారు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని చెప్పారు. భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు వన్డేలు, మూడు ట్వంటీ-20 మ్యాచులు ఆడనుంది.  వరల్డ్ కప్ విజేతలైన ఆస్ట్రేలియా ప్రస్తుతం మొదటి ర్యాంకులో ఉండటం, భారత్ రెండో ర్యాంకులో ఉండటంతో ఈ సిరీస్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సిరీస్లో భారత్ ఒక్క వన్డే మ్యాచ్ గెలిచినా చాలు తన రెండోస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో వన్డేలకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా పేస్ బౌలింగ్ ప్రధాన పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లు ప్రధాన అస్త్రంగా భారత్ బరిలోకి దిగనుంది. వీరితోపాటు యువకేరటం బరిందర్ సింగ్ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజా బరిలోకి దిగనున్నారు.

మరిన్ని వార్తలు