స్వల్ప స్కోరుకే సఫారీలు ఆలౌట్‌

8 Jan, 2018 16:18 IST|Sakshi

కేప్‌టౌన్‌:భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 130 పరుగుల స్వల్ప స్కోరు పరిమితమైంది. 65/2 ఓ‍వర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు.. మరో 65 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. టీమిండియా పేస్‌ విభాగం విజృంభించి సఫారీల పనిపట్టింది.  ఈ రోజు ఆటలో బూమ్రా, షమీలు తలో మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్నువిరవగా, భువనేశ్వర్‌ కమార్‌ రెండు వికెట్లు సాధించి సత్తా చాటాడు. అంతకుముందు హార్దిక్‌ పాండ్యా తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.  ఏబీ డివిలియర్స్‌(35) చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

భారీ వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, నాల్గో రోజు ఆటను ఆమ్లా, రబడాలు నెమ్మదిగా ఆరంభించారు. అయితే ప్రధానంగా షమీ పేస్‌ను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ వీరిద్దరూ అతని బౌలింగ్‌లోనే అవుటయ్యారు. తొలుత ఆమ్(4)లా మూడో వికెట్‌గా స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ కాగా, ఆపై కాసేపటికి రబడా(5) కూడా స్లిప్‌లో కోహ్లి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అటు తరువాత  డు ప్లెసిస్‌ (0), డీకాక్‌(8)లు సైతం తీవ్రంగా నిరాశపరిచారు. వికెట్‌ కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఇద్దరూ అవుటయ్యారు. కాగా, మహరాజ్‌(15)తో కలిసి డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 27 పరుగులు జత చేసిన తరువాత మహరాజ్‌ అవుటయ్యాడు. ఆపై ఎనిమిది పరుగుల వ‍్యవధిలో మోర్నీ మోర్కెల్‌(2), డివిలియర్స్‌లు అవుట్‌ కావడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో భారత్‌కు 208 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు నిర్దేశించారు.

మరిన్ని వార్తలు