భారత్‌ ‘ఎ’ ఘన విజయం

28 May, 2019 05:58 IST|Sakshi

బెల్గామ్‌: శ్రీలంక ‘ఎ’ జట్టుపై భారత్‌ ‘ఎ’ గర్జించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో లంక పనిపట్టింది. దీంతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ ఇన్నింగ్స్‌ 205 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ (4/78, 4/45) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. డిక్‌వెలా (103; 15 ఫోర్లు) పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేసిన శ్రీలంక ‘ఎ’... రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. ఏ ఒక్కరూ కనీసం 50 పరుగులైనా చేయకుండానే భారత బౌలర్లకు తలవంచారు.

సోమవారం 16 వికెట్లు కూలడంతో నాలుగు రోజుల మ్యాచ్‌ కాస్తా మూడు రోజుల్లోనే ముగిసింది. 83/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌లో  ప్రియాంజన్‌ (49; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా,  డిక్‌వెలా శతకం సాధించాడు. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించారు.  సందీప్‌ వారియర్, జయంత్‌ చెరో 2 వికెట్లు తీశారు. భారత్‌కు 390 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో అనంతరం ఫాలోఆన్‌ ఆడిన శ్రీలంక ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది.

మరిన్ని వార్తలు