విశాఖ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా 127 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ(5) వికెట్ను నష్టపోయింది. ఆ తరుణంలో కేఎల్ రాహుల్తో కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత కోహ్లి(24) ఔటయ్యాడు. కాసేపటికి రిషభ్ పంత్(3) అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌటయ్యాడు. దాంతో భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అటు తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్(50) ఔట్ కాగా మిగతా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్(1), కృనాల్ పాండ్యా(1), ఉమేశ్ యాదవ్(2)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. క్రీజ్లో ధోని(29 నాటౌట్) కడవరకూ ఉండటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆరుగురు భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం కావడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ బెహ్రన్డార్ఫ్లు తలో వికెట్ తీశారు.