డబ్లిన్ : ఐర్లాండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత ఓపెనర్లు దంచికొట్టారు. దీంతో పసికూన ఐర్లాండ్కు కొండంత లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఐర్లాండ్ ఫీల్డింగ్కు మొగ్గు చూపింది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ (97 ), శిఖర్ ధావన్ (74)లు విధ్వంసకర ఇన్నింగ్స్తో మంచి శుభారంభాన్ని అందించారు. దీంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. తొలి వికెట్కు ఈ ధ్వయం ఏకంగా 160 పరుగులు జోడించిననంతరం ధావన్ 74( 45 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్స్లు) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(10), దాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ధోని సాయంతో రోహిత్ దాటిగా ఆడటంతో భారత్ 200 పరుగులు దాటింది.
ఇదే తరహాలో ఆడే ప్రయత్నం చేసిన మహేంద్ర సింగ్ ధోని(10), సెంచరీకి చేరువగా వచ్చిన రోహిత్ శర్మ97(61 బంతులు, 8 ఫోర్లు, 5 సిక్స్లు)లు ఒకే ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్గా నిష్క్రమించాడు. చివరి బంతిని ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా సిక్స్ బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో పీటర్ చేస్ ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. కెవిన్ ఓ వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్ భారత్కు 100వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం.INd