ఇంగ్లండ్‌ లక్ష్యం 257

17 Jul, 2018 20:39 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  విరాట్‌ కోహ్లి(71; 72 బంతుల్లో 8 ఫోర్లు) , శిఖర్‌ ధావన్‌(44; 49 బంతుల్లో 7ఫోర్లు), ఎంఎస్‌ ధోని(42; 66 బంతుల్లో 4 ఫోర్లు)లు మాత్రమే రాణించడంతో టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(2) నిరాశపరిచాడు..  దాంతో టీమిండియా 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో ధావన్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.

కాగా, ఈ జోడి 71 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. అటు తర్వాత  దినేశ్‌ కార్తీక్‌(21) కూడా విఫలం కాగా, కోహ్లి బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే కోహ్లి 56 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కోహ్లి నాల్గో వికెట్‌గా ఔటైన వెంటనే సురేశ్‌ రైనా(1) కూడా పెవిలియన్‌ చేరాడు. దాంతో  158 పరుగుల వద్ద భారత జట్టు ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక హార్దిక్‌ పాండ్యా(21) ధాటిగా ఆడే క్రమంలో ఔట్‌ అవ్వగా, ధోని ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు.  చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌( 21), శార్దూల్‌ ఠాకూర్‌( 22 నాటౌట్‌)లు ఫర్వాలేదనిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.  ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లే, ఆదిల్‌ రషీద్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, మార్క్‌ వుడ్‌కు వికెట్‌ లభించింది.

 చదవండి: టాప్‌-10లో విరాట్‌ కోహ్లి

విరాట్‌ కోహ్లి మరో రికార్డు
 

మరిన్ని వార్తలు