భారత జట్టు బలం వారే!

25 May, 2017 10:16 IST|Sakshi
భారత జట్టు బలం వారే!
హైదరాబాద్‌: డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా మినీ వరల్డ్‌ కప్‌ ( ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి) బరిలోకి దిగుతున్న భారత జట్టుకు కెప్టెన్‌ కోహ్లీ, పటిష్టమైన పేస్‌ విభాగం, ఫామ్‌ లో ఉన్న ఆల్‌ రౌండర్లు బలం కానున్నారు. ఇప్పటికే వన్డే లో మూడో ర్యాంకులో ఉన్న భారత జట్టు ఇంగ్లండ్‌ వేదికగా దిగ్గజ జట్లతో పోటి పడనుంది. తొలి మ్యాచ్‌ దాయదీ దేశమైన పాకిస్థాన్‌ తో వేల్స్‌ మైదానంలో ఆడనుంది. ఇక జట్టు బలాలు, బలహీనతలు పరిశీలిస్తే.. కోహ్లీ కెప్టెన్సీ జట్టుకు బలం చేకూరనుంది.
 
కోహ్లీ నాయకత్వంలో భారత్‌ 20 మ్యాచ్‌లు ఆడగా 16 నెగ్గింది. కోహ్లీ మరోసారి రెచ్చిపోయి ఆడితే జట్టు సులువుగా భారీ స్కోర్లు చేయగలదు. ఇక ఇంగ్లండ్‌ గడ్డపై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఒక సెంచరీతో 424 పరుగులు చేశాడు. ఈ అనుభవం జట్టుకు కలిసిరానుంది. ఇక ఐపీఎల్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ చాంపియన్స్‌ ట్రోఫిలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక గత సీజన్‌ లో భారత్‌కు టైటిల్‌ అందించిన మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సలహాలు కూడా జట్టుకు లాభం చేకూర్చునున్నాయి. ఇక ఐపీఎల్‌ లో మైమరిపించిన ధోని కీపింగ్‌ కూడా జట్టుకు కలిసొచ్చే అంశమే.       
 
పటిష్టమైన ఫేస్‌ విభాగం
ఛాంపియన్స్‌ ట్రోఫికి ఎంపికైన పేస్‌ బౌలర్లందరూ ఐపీఎల్‌ అసాధారణ ప్రతిభ కనబర్చిన వారు కావడం జట్టు కలిసొచ్చే అంశం. భువనేశ్వర్‌ కుమార్‌ (26) వికెట్లతో టాప్‌ లో నిలవగా, జస్ప్రిత్‌ బూమ్రా (20), ఉమేశ్‌ యాదవ్‌ (17) లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా బుమ్రా రాణించడం జట్టుకు అదనపు బలం.
 
అదనపు బలంగా ఆల్‌ రౌండర్లు
 జట్టుకు ఎంపికైన ఆల్‌ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలు ఫామ్‌ కూడా జట్టుకు అదనపు బలంగా చెప్పవచ్చు. ఇక రవీంద్ర జడేజా ఆసీస్‌ టెస్టు సిరీస్‌ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ లోనే జరిగిన గత చాంపియన్స్‌ ట్రోఫిలో అసాధారణ ప్రతిభ కనబర్చిన జడ్డూ టైటిల్‌ గెలవడంలో ముఖ్య పాత్ర పోశించాడు. ఇక యువ ఆల్‌ రౌండర్‌ పాండ్యా ఐపీఎల్‌లో తన సత్తా చాటాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతని దూకుడు అందరిని ఆకట్టుకుంది.  
 
బలహీనతలు
ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌, పేసర్‌ మహ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌ల పై అనుమానాలు నెలకొన్నాయి. గాయంతో ఈ సీజన్‌ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైన అశ్విన్‌ ధర్మశాల టెస్టు అనంతరం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ లో పాల్గొనకపోవడం భారత్‌ను కొంత కలవరపెడ్తుంది. ఇక షమీ ఐపీఎల్‌ లో రాణించకపోవడం కూడా జట్టుకు ఇబ్బందిగా మారింది. ఢిల్లీ తరుపున 8 మ్యాచ్‌లు ఆడిన షమీ కేవలం 5 వికెట్ల తీసి పరుగులు బాగా ఇచ్చాడు. మన దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ నిలకడలేని ఫామ్‌ కూడా జట్టుకు కలవరపెట్టె విషయమే. ఐపీఎల్‌లో భారత్‌ బ్యాట్స్‌ మెన్‌ ఏ ఒక్కరు టాప్‌లో నిలవలేకపోయారు. 
మరిన్ని వార్తలు