ఆసీస్‌ స్కోరు 158.. భారత్‌ టార్గెట్‌ 174

21 Nov, 2018 15:53 IST|Sakshi

బ్రిస్బేన్‌: తొలి టీ20లో భారత్‌కు ఆస్ట్రేలియా 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. డీఎల్‌ఎస్‌ ప్రకారం టీమిండియాకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు చేసిన ఆసీస్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ చెలరేగడంతో ఆసీస్‌ చాలెంజింగ్‌ స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్‌ సిక్సర్లతో చెలరేగాడు. 24 బంతుల్లో 4 సిక్సర్లతో 46 పరుగులు బాదాడు. స్టోయినిస్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఫించ్‌(27), క్రిస్‌ లిన్‌ (37) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ఖలీల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తుండగా 16.1 ఓవర్లలో వర్షం రావడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు అంపైర్లు కుదించారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 153/3. ఆట తిరిగి మొదలైన తర్వాత తొలి బంతికే మ్యాక్స్‌వెల్‌ అవుటయ్యాడు. చివరి ఐదు బంతులకు ఆసీస్‌ కేవలం ఐదు పరుగులు మాత్రమే సాధించింది.

మరిన్ని వార్తలు