భారత్‌ ‘ఎ’ విజయం

30 Aug, 2019 07:05 IST|Sakshi

మెరిసిన అక్షర్, శివమ్, చహల్‌

తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో ఆరంభమైన ఐదు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్‌ ‘ఎ’ శుభారంభం చేసింది. 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఆదరగొట్టాడు. మొదట బ్యాటింగ్‌లో (36 బంతుల్లో 60 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి, అనంతరం కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్‌ 5 వికెట్లతో రాణించాడు. 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (46), మనీశ్‌ పాండే (39), ఇషాన్‌ కిషన్‌ (37) రాణించారు. శివమ్‌ దూబే (60 బంతుల్లో 79 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరిశాడు. అనంతరం దక్షిణాఫ్రికా ‘ఎ’ చహల్‌ స్పిన్‌ దెబ్బకు 45 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. రీజా హెండ్రిక్స్‌ (108 బంతుల్లో 110; 12 ఫోర్లు, సిక్స్‌) ఒంటరి పోరాటం వృథా అయింది. రెండో వన్డే ఈ నెల 31న జరగనుంది.

మరిన్ని వార్తలు