ఊహించినట్టే ప్రపంచ కప్ క్వార్టర్స్లో భారత్ ప్రత్యర్థి బంగ్లాదేశ్ కానుంది. క్వార్టర్స్లో గ్రూపు-బి టాపర్ భారత్, గ్రూపు-ఎ 4వ స్థానంలో బంగ్లా తలపడనున్నాయి. ఈ నెల 19న జరిగే క్వార్టర్స్ పోరులో భారత్, బంగ్లా ఆడనున్నాయి.
శుక్రవారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మ్యాచ్ ఫలితంలో గ్రూపు-ఎలో తొలి, నాలుగో జట్ల స్థానాలు ఖరారయ్యాయి. గ్రూపు-ఎలో కివీస్ టాపర్ గా ఉండగా, బంగ్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ గ్రూపులో కివీస్, ఆసీస్, లంక, బంగ్లా ఇదివరకే నాకౌట్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి కివీస్ (12), లంక (8), ఆసీస్ (7), బంగ్లా (7) వరుసగా టాప్-4లో ఉన్నాయి. కివీస్, లంక, బంగ్లా లీగ్ దశలో ఆరూ మ్యాచ్లూ ఆడేశాయి. ఆసీస్ మాత్రం చివరి మ్యాచ్ స్కాట్లాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో అద్భుతం జరిగి కంగారూలు ఓడినా.. బంగ్లా కంటే మెరుగైన రన్రేట్ ఉన్నందున మూడో స్థానంలో ఉంటారు. గెలిస్తే రెండో స్థానానికి చేరుతారు. ఫలితం ఏదైనా కివీస్, బంగ్లా స్థానాల్లో మార్పు ఉండదు. ఇక ఐదు విజయాలతో గ్రూపు-బి టాపర్గా ఉన్న భారత్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. కాబట్టి క్వార్టర్స్ లో ఉపఖండం జట్లు భారత్, బంగ్లా అమీతుమీ తేల్చుకోనున్నాయి.