-

మూడో వన్డే; మ్యాక్స్‌వెల్‌ అవుట్‌

18 Jan, 2019 10:28 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా 161 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. టాస్‌ గెలిచి ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఆరంభించగానే వరుణుడు అడ్డుతగిలాడు. రెండు బంతులు వేయగానే చినుకులు మొదలయ్యాయి. దీంతో ఆటకు కాసేపు అంతరాయ కలిగింది. ఆట తిరిగి మొదలయ్యాక ఆసీస్‌ను టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గట్టి దెబ్బ తీశాడు. స్వల్ప స్కోరుకే ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్‌ స్కోరు 8 పరుగుల వద్ద అలెక్స్‌ క్యారీ(5)ని అవుట్‌ చేశాడు. 27 పరుగుల వద్ద ఫించ్‌(14) పెవిలియన్‌ చేరాడు.

తర్వాత ఖవాజా, మార్ష్‌ జాగ్రత్తగా ఆడి స్కోరును వంద పరుగులకు చేర్చారు. మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించిన ఈ జోడీని చాహల్‌ విడగొట్టాడు. ఇద్దరినీ వెంట వెంటనే పెవిలియన్‌కు పంపాడు. 100 పరుగుల వద్ద ఖవాజా(34) మూడో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత షాన్‌ మార్ష్‌(39), స్టొయినిస్‌(10)ను కూడా చాహల్‌ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ మరోసారి కంగారు పడింది. వచ్చిరావడంతోనే మ్యాక్స్‌వెల్‌ ఫోర్లతో విరుచుకుపడటంతో ఆసీస్‌ కోలుకున్నట్టుగా కనిపించింది. దూకుడు మీదున్న మ్యాక్స్‌వెల్‌ను షమి అవుట్‌ చేయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాక్స్‌వెల్‌ 19 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా 36 ఓవర్లలో 171/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు