ఆఖరి పంచ్‌ ఎవరిదో!

19 Jan, 2020 02:09 IST|Sakshi

నేడు భారత్‌–ఆస్ట్రేలియా చివరి వన్డే

గెలిస్తే సిరీస్‌ సొంతం

ఆత్మవిశ్వాసంతో ఇరు జట్లు

మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగిన రెండు వన్డేలు చూసిన తర్వాత ఈ సిరీస్‌ కనీసం ఐదు మ్యాచ్‌లైనా ఉంటే బాగుండేదని సగటు అభిమానికి అనిపించడంలో తప్పు లేదు. కానీ ఆ అవకాశం లేకుండా పోరు మూడు మ్యాచ్‌లకే పరిమితమైంది. ఇక ఇప్పుడు సిరీస్‌ విజేతగా ఎవరు నిలుస్తారో తేల్చే సమరానికి రంగం సిద్ధమైంది.    తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ఆధిపత్యం ప్రదర్శించగా... గత మ్యాచ్‌లో భారత్‌ తమ స్థాయిని ప్రదర్శించింది. వన్డే సిరీస్‌ విజయంతో స్వదేశంలో సీజన్‌ను ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉండగా... భారత గడ్డపై ఏడాది క్రితం ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆసీస్‌ భావిస్తోంది.   

బెంగళూరు: సుదీర్ఘమైన విదేశీ పర్యటనకు ముందు ఈ సీజన్‌లో భారత్‌ స్వదేశంలో తమ చివరి మ్యాచ్‌కు సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే చివరి పోరులో ఆస్ట్రేలియాతో కోహ్లి సేన తలపడనుంది. సిరీస్‌ ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్‌ చేరుతుంది. రెండు జట్లు కూడా దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పాటు భారీ స్కోర్ల వేదికపై మ్యాచ్‌ జరుగుతుండంతో మరో హోరాహోరీ పోరును ఆశించవచ్చు.  

గాయాల నుంచి కోలుకున్నారా!  
చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు వన్డేల్లో కలిపి డబుల్‌ సెంచరీ సహా 318 పరుగులు చేసిన రికార్డు రోహిత్‌ శర్మ సొంతం. రెండో వన్డేలో అతనికి తగిలిన గాయం పెద్దదిగా కనిపించకపోయినా దానిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మరో ఓపెనర్‌ ధావన్‌ గాయం గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే వీరిద్దరు బరిలోకి దిగవచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకంగా ఉంది. ఓపెనర్లతో పాటు రాహుల్‌ అద్భుత ఫామ్‌ భారత్‌కు అదనపు బలంగా మారింది. పైగా అతను ఇప్పుడు సొంత మైదానంలో ఆడబోతున్నాడు. వీరందరికీ కెపె్టన్‌ కోహ్లి బ్యాటింగ్‌ తోడైతే భారత్‌  భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. వన్డే జట్టులో స్థిరపడే ప్రయత్నంలో ఉన్న అయ్యర్‌ గత రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.

తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉన్నా అతను ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకోలేదు. ఇప్పుడైనా అయ్యర్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. ఇదే తరహాలో మనీశ్‌ పాండేకు కూడా మరో అవకాశం దక్కవచ్చు. పంత్‌ ఎన్‌సీ ఏలోనే ఉన్నా... మ్యాచ్‌ ఫిట్‌గా ఉన్నాడో లేదో సందేహమే. పైగా రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో రాహుల్‌ చక్కటి కీపింగ్‌ తర్వాత ఇదే జట్టును భారత్‌ కొనసాగించే అవకాశం ఉంది. రెండో వన్డేలో భారత బౌలర్లు కూడా మంచి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా బుమ్రా తొలి స్పెల్‌ చూస్తే అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అర్థమవుతోంది. స్పిన్నర్‌గా మళ్లీ కుల్దీప్‌కే అవకాశం ఖాయం.  

హాజల్‌వుడ్‌కు చోటు!  
రాజ్‌కోట్‌ వన్డేలో పరాజయం పాలైనా... ఆ్రస్టేలియా 300కు పైగా పరుగులు చేసి స్వల్ప తేడాతోనే ఓడింది. కాబట్టి ఆ జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం రావచ్చు. ముఖ్యంగా భారత పిచ్‌లపై ఐపీఎల్‌ ద్వారా రాటుదేలిపోయిన వార్నర్‌కు మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా ఉంది. కెప్టెన్ ఫించ్‌తో కలిసి శుభారంభం చేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. చక్కటి ఇన్నింగ్స్‌తో వన్డేల్లో తాను ఎంత కీలకమో స్మిత్‌ చూపించగా... లబ్‌షేన్ కూడా అతనికి సరి జోడీగా నిలిచాడు. వీరిద్దరు కలిసి మ్యాచ్‌ స్వరూపం మార్చేయగలరు. మిడిలార్డర్‌లో క్యారీ, టర్నర్‌ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా స్టార్క్‌ ఆసీస్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ అనడంలో సందేహం లేదు. అతనికి తోడుగా కమిన్స్‌ చెలరేగుతున్నాడు. టూర్‌లో చివరి మ్యాచ్‌ కాబట్టి రిచర్డ్సన్‌ స్థానంలో హాజల్‌వుడ్‌కు అవకాశం దక్కవచ్చు.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఎక్కువే కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పాండే, జడేజా, షమీ, కుల్దీప్, సైనీ, బుమ్రా. ఆ్రస్టేలియా: ఫించ్‌ (కెప్టెన్), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, టర్నర్, క్యారీ, అగర్, స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, జంపా.

►4 చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియా మధ్య 7 వన్డేలు జరగ్గా భారత్‌ 4 ఓడి 2 గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చివరగా సెప్టెంబర్, 2017లో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ సెంచరీ సహాయంతో ఆసీస్‌ 21 పరుగులతో నెగ్గింది.  

మరిన్ని వార్తలు