భారత విజయానికి అడ్డుపడుతున్న వరుణుడు
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి, వర్షం కారణంగా తొలుత తాత్కాలికంగా మ్యాచ్ నిలిపేసిన అంపైర్లు.. పరిస్థితి మెరుగుపడకపోవడంతో నాలుగోరోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్లో 322 పరుగులు వెనకబడిన ఆతిథ్య జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా(4), మార్కస్ హారిస్(2)లు ఉన్నారు. ఆట ముగిసే సమయానికి నాలుగు ఓవర్లకు వికెట్ కోల్పోకుండా ఆసీస్ 6 పరుగులు చేసింది.
ఇక భారీ ఆధిక్యం సాధించిన భారత్కు విజయం ఖాయం అనుకుంటున్న సందర్భంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం కారణంగానే నాలుగో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా.. చివరకు వెలుతురు లేమితో మ్యాచ్ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో రోజు కేవలం 25.2 ఓవర్లే ఆటనే జరిగింది. ఇక చివరిదైన ఐదో రోజు వాతావరణం సహకరిస్తేనే భారత్ గెలుపు లాంఛనం కానుంది.