మరోసారి కుల్దీప్‌ స్పిన్‌ మాయలో ఇంగ్లండ్‌..!

14 Jul, 2018 17:07 IST|Sakshi

లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని అందించారు. ఆది నుంచి వికెట్‌ ఇవ్వకుండా జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. పది ఓవర్లలో ఇంగ్లండ్‌​ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు కొరకరాని కొయ్యగా మారిన చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ రంగంలోకి దిగాడు. అంతే కుల్దీప్‌ వేసిన 11 ఓవర్‌ రెండో బంతికే బెయిర్‌ స్టో 38 పరుగుల వద్ద ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటివరకూ క్రీజ్‌లో పాతుకుపోయిన ఇంగ్లండ్‌ ఓపెనర్లను చైనామన్‌ విడదీశాడు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జోరూట్‌తో కలిసి జాసన్‌ రాయ్‌ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఆ జోడిని కూడా కుల్దీప్‌ వదలలేదు. కుల్దీప్‌ వేసిన 15 ఓవర్‌ మొదటి బంతికే షాట్‌ కొట్టబోయి లాంగ్‌లో ఉన్న ఉమేష్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రెండో వన్డేలో కూడా కుల్దీప్‌ స్పిన్‌ మాయలో ఇంగ్లండ్‌ చిక్కుకుంది. 20 ఓవరల్లో ఇంగ్లండ్‌ 2వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది.  ప్రస్తుతం కెప్టెన్‌ మోర్గాన్(18) పరుగులతో‌, జోరూట్‌లు(24) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కుల్దీప్‌ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు