ఆటాడుకున్నారు

26 Jul, 2018 00:38 IST|Sakshi

నలుగురు బ్యాట్స్‌మెన్‌ అర్ధసెంచరీలు

ఆకట్టుకున్న కెప్టెన్‌ కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌

ఎస్సెక్స్‌ కౌంటీతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌  

చెమ్స్‌ఫోర్డ్‌: సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు చక్కటి ప్రాక్టీస్‌ లభించింది. ఎస్సెక్స్‌ కౌంటీ జట్టుతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారత్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 322/6తో మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లి సేన... ఓపెనర్‌ ధావన్‌ (0), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా (1), అజింక్య రహానే (17) వికెట్లను త్వరగానే కోల్పోయింది. దీంతో 44/3తో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ (113 బంతుల్లో 53; 7 ఫోర్లు)కి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (93 బంతుల్లో 68; 12 ఫోర్లు) జత కలిశాడు. నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించాక వీరు వెంటవెంటనే ఔటయ్యారు.

అనంతరం ఎడాపెడా బౌండరీలు బాదుతూ కేఎల్‌ రాహుల్‌ (92 బంతుల్లో 58; 12 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ (94 బంతుల్లో 82 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) స్కోరును ముందుకు నడిపించారు. ఆరో వికెట్‌కు మంచి రన్‌రేట్‌తో 114 పరు గులు జోడించారు. రాహుల్‌ వెనుదిరిగాక వచ్చిన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (56 బంతుల్లో 33 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) కూడా బ్యాట్‌ ఝళిపించడంతో జట్టు 300 మార్కును దాటింది. ఎస్సెక్స్‌ బౌలర్లలో కోల్స్‌ (2/31), వాల్టర్‌ (2/90) రెండేసి వికెట్లు పడగొట్టారు. 
 

మరిన్ని వార్తలు