టాప్‌–5 రాణించారు

20 Nov, 2018 01:31 IST|Sakshi

భారత్‌ ‘ఎ’కు తగినంత ప్రాక్టీస్‌

న్యూజిలాండ్‌ ‘ఎ’తో మ్యాచ్‌ ‘డ్రా

మౌంట్‌ మాంగనీ (న్యూజిలాండ్‌): ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఆశించిన భారత టెస్టు బ్యాట్స్‌మెన్‌ సంతృప్తికరంగా ‘ఎ’మ్యాచ్‌ను ముగించారు. న్యూజిలాండ్‌ ‘ఎ’తో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన టెస్టు ఆటగాళ్లు మురళీ విజయ్, అజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లో తమ ఆటను చక్కదిద్దుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 35/0తో సోమవారం ఆట ప్రారంభించిన భారత్‌ ‘ఎ’తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. చివరి రోజు భారత్‌ మొత్తం 57 ఓవర్లు ఎదుర్కొంది.

మురళీ విజయ్‌ (113 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా, రహానే (94 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన హనుమ విహారి (63 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (53 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అదే జోరును కొనసాగించగా, మయాంక్‌ అగర్వాల్‌ (70 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించాడు. మురళీ విజయ్‌ తొలి వికెట్‌కు పృథ్వీ షాతో 74 పరుగులు, రెండో వికెట్‌కు మయాంక్‌తో 81 జోడించడం... నాలుగో వికెట్‌కు అభేద్యంగా 86 పరుగులు జోడించడం చివరి రోజు ఆటలో విశేషాలు. భారత్‌ ‘ఎ’, న్యూజిలాండ్‌ ‘ఎ’మధ్య రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌ ఈ నెల 23 నుంచి హామిల్టన్‌లో జరుగుతుంది.

మరిన్ని వార్తలు