భారత్‌-దక్షిణాఫ్రికాల తొలి వన్డే వర్షార్పణం

12 Mar, 2020 17:08 IST|Sakshi

ధర్మశాల : భారత్‌- దక్షిణాఫ్రికా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది.  ఈ మ్యాచ్‌కు పదే పదే వరుణుడు అడ్డంకిగా మారండంతో చివరకు రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఉదయం నుంచి పలు దఫాలుగా వర్షం పడుతూ ఉండటంతో టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సాయంత్ర సమయం‍లో వరుణుడు కాస్త తెరిపిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను నిర్వహించడానికి వీలు లేకుండా మారిపోయింది.  ఫలితంగా మ్యాచ్‌ రద్దు కాకతప్పలేదు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లక్నోలో జరగనుంది.  (రికార్డు స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌కు కరోనా బాధితుడు)

మ్యాచ్‌కు కరోనా భయం :
కాగా  భారత్‌-దక్షిణాఫ్రికాల వన్డే సిరీస్‌ను కరోనా భయం వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది. తొలి వన్డేకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య గణనీయకంగా తగ్గిపోయింది. కాగా హెచ్‌పీసీఏ స్టేడియం సామర్థ్యం 23వేలు కాగా సరాసరి ఎంతమంది హాజరయ్యారనేది తెలియదు కానీ స్టేడియంలో ప్రేక్షకుల హడావుడి చాలా తక్కువ సంఖ్యలోనే ఉంది. ఇది మిగతా వన్డేలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. పరిస్థితి ఇలానే ఉంటే ఒకవేళ ఐపీఎల్‌ జరిగితే మాత్రం..  ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌ 13వ సీజన్‌ నిర్వహించాలా? వద్దా? అనే దానిపై మార్చి 14న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం కానుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు లక్షకు పైగా చేరడంతో పాటు మృతుల సంఖ్య 4800 పైగా చేరుకుంది. భారత్‌లోనూ ఇప్పటివరకు 73 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్రం స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు