ఆగస్టులో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టి20 సిరీస్‌

22 May, 2020 03:39 IST|Sakshi

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆగస్టు చివరి వారంలో సఫారీ గడ్డపై మూడు టి20ల సిరీస్‌ జరిగే అవకాశం ఉంది. ఇది ముందే అనుకున్న షెడ్యూలు కానప్పటికీ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, సీఎస్‌ఏ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ ప్రత్యేకంగా అభ్యర్థించారు. అయితే కోవిడ్‌ మహమ్మారి పరిస్థితులపైనే ఇప్పుడీ సిరీస్‌ ఆధారపడింది. పరిస్థితి అదుపులో ఉంటే, ప్రభుత్వాల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే ఈ పొట్టి మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు భావిస్తున్నాయి. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ఈ సిరీస్‌ విషయమైన జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని ఫాల్‌ అన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం టోర్నీ జరిగేందుకు సహకరిస్తుందని చెప్పారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌ తమకు కీలకమన్నారు. ప్రేక్షకులు లేకుండా గేట్లు మూసేసి నిర్వహించాలని ఆదేశించినా అందుకు సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే సిరీస్‌ జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘ముందుగా మేం ఆటగాళ్లకు గ్రీన్‌జోన్‌లో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఆ తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడితే దక్షిణాఫ్రికాలో ఆడతాం’ అని చెప్పారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఎలాగైన నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐ కూడా ఈ సిరీస్‌ జరగాలనే కోరుకుంటుంది. తద్వారా ఐపీఎల్‌కు దక్షిణాఫ్రికా నుంచి సహకారం పొందాలని ఆశిస్తోంది.  

>
మరిన్ని వార్తలు