టీమిండియా రికార్డులు.. విశేషాలు

23 Dec, 2019 10:07 IST|Sakshi

కటక్‌: వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్‌ నెగ్గింది.  వెస్టిండీస్‌ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు),  రాహుల్‌ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ లభించాయి. కాగా, ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన గెలుపును అందుకుని సంవత్సరాన్ని ఘనంగా ముగించిన టీమిండియా పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది.

► ఓ ఏడాదిలో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 22 ఏళ్లుగా శ్రీలంక ఓపెనర్‌ సనత్‌ జయసూర్య (1997లో 2387 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్‌ విండీస్‌పై మూడో మ్యాచ్‌లో అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది రోహిత్‌ మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 2442 పరుగులు సాధించాడు.  

► ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ ఈ ఏడాది 28 వన్డేలు ఆడి 1490 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి (1377), షై హోప్‌ (విండీస్‌–1345) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు గెల్చుకున్న క్రికెటర్ల జాబితాలో విరాట్‌ కోహ్లి (57 సార్లు) ప్రస్తుతం జాక్వస్‌ కలిస్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. సచిన్‌ (76 సార్లు), జయసూర్య (58 సార్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  

► వరుసగా నాలుగో ఏడాది విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు) అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లి 2016లో 2595... 2017లో 2818... 2018లో 2735... 2019లో 2455 పరుగులు చేశాడు.  

► వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది 19వసారి. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ (11 సార్లు), ఆ్రస్టేలియా (10 సార్లు), శ్రీలంక (10 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

► ఈ మ్యాచ్‌ ద్వారా పేస్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీ భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 229వ క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ సంవత్సరం భారత్‌ తరఫున ఐదుగురు ఆటగాళ్లు సిరాజ్, విజయ్‌ శంకర్, శుబ్‌మన్‌ గిల్, శివమ్‌ దూబే వన్డేల్లో అరంగేట్రం చేశారు.  

► వెస్టిండీస్‌పై వరుసగా పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను భారత్‌ గెల్చుకుంది. ఓ ప్రత్యర్థిపై అత్యధిక వరుస సిరీస్‌ విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. శ్రీలంకపై సాధించిన తొమ్మిది వరుస సిరీస్‌ విజయాల రికార్డును భారత్‌ (2005 నుంచి) సవరించింది.

>
మరిన్ని వార్తలు