మహిళా టీ20 ప్రపంచకప్‌: భారత్‌ ప్రత్యర్థి ఇంగ్లండ్‌ 

19 Nov, 2018 09:38 IST|Sakshi

ప్రొవిడెన్స్‌ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళలు సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనున్నారు. లీగ్‌ మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో సత్తాచాటిన హర్మన్‌ సేన గ్రూప్‌-బి టాపర్‌గా సెమీస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన గ్రూప్‌-ఏ చివరి లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం విండీస్‌.. డాటిన్‌ (46),క్యాంప్‌బెల్లె (45)ల ఇన్నింగ్స్‌తో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

ఈ గెలుపుతో విండీస్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా.. భారత్‌, ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. ఇదే ఇంగ్లండ్‌తో 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళలు ఒత్తిడిని అధిగమించలేక తృటిలో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక మరోసారి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టబోతున్న హర్మన్‌ సేన అలాంటి తప్పిదాలు పునరావృతం చేయవద్దని భావిస్తోంది. ఇక భారత మహిళల్లో హర్మన్‌, మంధాన, మిథాలీ రాజ్‌లు బ్యాట్‌తో రాణిస్తుండగా.. స్పిన్‌ చతుష్టయం అనూజ పాటిల్‌, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, దీప్తిశర్మలు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. ఈ సారి ఎలాగైన టైటిల్‌ నెగ్గాలనే కసితో భారత మహిళలు బరిలోకి దిగుతున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సెమీస్‌ పోరు జరుగనుంది.

మరిన్ని వార్తలు