‘టీమిండియాకు కష్టాలు తప‍్పవు’

22 Sep, 2018 12:09 IST|Sakshi

మెల్‌బోర్న్: మరో రెండు నెలల్లో తమ దేశ పర్యటనకు రాబోతున్న టీమిండియాకు కష్టాలు తప్పవంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌. ఇంగ్లండ్‌లో ఘోర పరాభవం ఎదుర‍్కొన్న టీమిండియా.. ఆసీస్‌ పర్యటనలో కూడా అదే తరహా అనుభవాన్ని చూడబోతుందని జోస్యం చెప్పాడు. సీమ్‌ బౌలింగ్‌కు అత్యంత అనుకూలమైన ఆసీస్‌ పిచ్‌లపై టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కఠిన పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందన్నాడు. ‘ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ దారుణంగా వైఫల్యం చెందింది. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన ప్రతీసారి టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. ప్రధానంగా బంతి స్వింగ్‌ అయ్యే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తడబాటుకు లోనవుతుంటారు.

సీమ్‌ బౌలింగ్‌లో బంతి తన దిశను గాలిలోనే మార‍్చుకుంటే భారత ఆటగాళ్లు సునాయాసంగా వికెట్లు సమర్పించుకుంటారు. ఇంగ్లండ్‌లో అదే చూశాం.. ఆసీస్‌లో కూడా అదే రిపీట్‌ అవుతుంది. ఉప ఖండపు పిచ్‌ల్లో తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మేము చాలాసార్లు ఇబ్బంది పడ్డాం. ఇక ఆసీస్‌ పిచ్‌లు మా పేస్‌కు ఎటాక్‌కు పూర్తి అనుకూలంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో ఆస్ట్రేలియాలో టీమిండియాకు అసలు సిసలు సవాల్‌ ఎదురవుతుంది’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. నవంబర్‌లో భారత క్రికెట్‌ జట్టు.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌-ఆసీస్‌ల మధ్య మూడు టీ20 సిరీస్‌తో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు