కివీస్‌తో వన్డే: అమ్మాయిలూ తడబాటే

1 Feb, 2019 09:41 IST|Sakshi

హామిల్టన్‌: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత మహిళల జట్టు కూడా బ్యాటింగ్‌లో తడబడింది. హామిల్టన్‌ వేదికగా సెడాన్‌ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్స్‌ తీవ్రంగా నిరాశపరిచారు. కివీస్‌ బౌలర్‌ అన్నా పీటర్సన్‌(4/21) ధాటికి భారత జట్టు 149 పరుగులకే ఆలౌటైంది.  పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో అదరొట్టిన స్మృతి మంధన(1), రోడ్రిగ్స్‌(12), మిథాలీ(9)లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో దీప్తి శర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్‌ను పీటర్సన్‌ పెవిలియన్‌కు చేర్చింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. జట్టును దీప్తి శర్మ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం దీప్తి శర్మ(52)కూడా పీటర్సన్‌ బౌలింగ్‌లోనే  వెనుదిరిగింది. చివర్లో హేమలత(13), గోస్వామి(12)లు రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. కివీస్‌ బౌలర్లలో పీటర్సన్‌ నాలుగు, లీ తహుహు మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. 
 

మరిన్ని వార్తలు