భారత మహిళల ఓటమి

12 Jul, 2015 01:07 IST|Sakshi
భారత మహిళల ఓటమి

తొలి టి20లో కివీస్ విజయం
 బెంగళూరు: వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలి టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ షాకిచ్చింది. కెప్టెన్ సోఫీ డివైన్ (22 బంతుల్లో 70; 5 ఫోర్లు; 8 సిక్సర్లు) తుఫాన్ ఆటతీరుతో చెలరేగడంతో శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా... భారత్ 19.5 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది.
 
 కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ప్రదర్శించిన కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ మిథాలీ రాజ్ (23 బంతుల్లో 35; 6 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. నీల్సన్, బ్రాడ్‌మోర్‌లకు మూడేసి వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కివీస్ డివైన్ జోరుతో.... 12.3 ఓవర్లలో రెండు వికెట్లకు 126 పరుగులు చేసి గెలిచింది. మహిళల క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధసెంచరీ (18 బంతుల్లో) సాధించిన క్రికెటర్‌గా డివైన్ రికార్డు సృష్టించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టి20 ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది.
 

>
మరిన్ని వార్తలు