దీప్తి సూపర్‌ బౌలింగ్‌

25 Sep, 2019 04:00 IST|Sakshi

తొలి టి20లో భారత మహిళల ఘన విజయం

సూరత్‌:  ఆఫ్‌స్పిన్నర్‌ దీప్తి శర్మ (3/8) అద్భుత ప్రదర్శనకు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమైన టి20 సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో భారత్‌  11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. స్మృతి మంధాన (21), జెమీమా రోడ్రిగ్స్‌ (19) ఫర్వాలేదనిపించారు.

అరంగేట్ర మ్యాచ్‌ ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం షెఫాలీ వర్మ (0) ఖాతా తెరవకుండానే ఔటయింది. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (3/26), నడైన్‌ డిక్లెర్క్‌ (2/10) వరుసగా వికెట్లు పడగొట్టడంతో భారత్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా... మిగ్నాన్‌ డు ప్రీజ్‌(43 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాయంతో చివరి వరకు పోరాడింది. 3 బంతుల్లో 12 పరుగులు అవసరమైన స్థితిలో డు ప్రీజ్, ఎంలాబా (0)లను ఔట్‌ చేసిన రాధా యాదవ్‌ భారత్‌కు విజయాన్ని ఖాయం చేసింది. పూనమ్‌ యాదవ్‌ (2/25), రాధా యాదవ్‌ (2/29), పేసర్‌ శిఖా పాండే (2/18) ఆకట్టుకున్నారు.  

►2 భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన రెండో  పిన్న వయసు్కరాలిగా షఫాలీ వర్మ (15 ఏళ్ల 239 రోజులు) గుర్తింపు పొందింది. గతంలో గార్గి బెనర్జీ 14 ఏళ్ల 162 రోజుల వయసులో (1978లో) భారత్‌కు వన్డేలో ప్రాతినిధ్యం వహించింది.  

మరిన్ని వార్తలు