టీమిండియా ఘన విజయం.. సిరీస్‌ కైవసం

22 Dec, 2019 21:42 IST|Sakshi

కటక్‌:  వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. 316 లక్ష్య చేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి 48.4 ఓవర్లలో విజయం సాధించింది. విరాట్‌ కొహ్లీ (85, 81 బంతుల్లో 9ఫోర్లు) చెలరేగిపోగా, కేఎల్‌ రాహుల్‌(77, 89బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్‌), రోహిత్‌ శర్మ(63, 63బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్‌) అర్థ శతకాలతో రాణించారు. చివరి క్షణంలో జడేజా(39, 31బంతుల్లో 4ఫోర్లు), శార్దుల్‌ ఠాకుర్‌(17, 6బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌ ) చెలరేగిపోవడంతో 8 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. దీంతో 2-1తేడాతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుంది. 
(చదవండి : హిట్‌మ్యాన్‌ మరో వరల్డ్‌ రికార్డు)

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో విండీస్‌ బ్యాటింగ్‌ను లూయిస్‌, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల  జత చేసిన తర్వాత లూయిస్‌ ఔట్‌ కాగా, కాసేపటికి హోప్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. లూయిస్‌ను  జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. ఆపై రోస్టన్‌ ఛేజ్‌కు హెట్‌మెయిర్‌ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ‍్యవధిలో చేజ్‌ను సైతం సైనీ  బౌల్డ్‌ చేశాడు. ఆ తరుణంలో నికోలస్‌ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్‌ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది.
(చదవండి : 17 ఏళ్ల తర్వాత విండీస్‌ మరో రికార్డు)

బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్‌ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్‌ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 48 ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్‌ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆడాడు. ఈ జోడి చివరి రెండు ఓవర్లలో 32 పరుగుల్ని సాధించారు. ఇందులో 29 పరుగుల్ని పొలార్డ్‌ సాధించాడు. చివరి పది ఓవర్లలో 118 పరుగుల్ని విండీస్‌ పిండుకుంది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు సాధించగా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజాలకు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు