అప్పుడు రైనా.. ఇప్పుడు కార్తీక్‌

20 Mar, 2018 13:27 IST|Sakshi

కొలంబో: బంగ్లాదేశ్‌తో ముక్కోణపు టీ 20 సిరీస్‌ తర్వాత భారత వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ హీరోగా మారిపోయాడు. ఆఖరి బంతిని సిక్స్‌గా కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించడంతో పాటు కొత్త చరిత్రను లిఖించాడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన రెండో క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ గుర్తింపు సాధించాడు.

1986లో షార్జాలో జరిగిన ఆస్ట్రేలేసియా కప్‌ ఫైనల్లో భారత్‌పై చివరి ఓవర్‌ చివరి బంతికి మియాందాద్‌ సిక్స్‌ కొట్టి పాక్‌ను గెలిపించగా, ఇప‍్పుడు టీ 20 సిరీస్‌ ఫైనల్లో దినేశ్‌ కార్తీక్‌ సిక్స్‌ కొట్టి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

 ఇదిలా ఉంచితే, టీ 20ల్లో భారత్‌ చివరి బంతికి గెలిచిన సందర్బాలో రెండు మాత్రమే. 2016 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన చివరిదైన మూడో టీ 20లో భారత్‌ ఆఖరి బంతికి గెలిచింది. అప్పుడు భారత్‌ జట్టును ఆఖరి బంతికి రైనా గెలిపించగా, ఇప్పుడు దినేశ్‌ కార్తీక్‌ విజయాన్ని అందించాడు. అయితే అప్పుడు ఆఖరి బంతికి భారత్‌ విజయానికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో రైనా ఫోర్‌ కొట్టి గెలుపును సాధించిపెట్టాడు. ఆ సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు