సింధు సత్తా చాటేనా!

6 Nov, 2018 03:40 IST|Sakshi

నేటి నుంచి చైనా ఓపెన్‌ టోర్నీ

ఫుజౌ (చైనా): ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు... నేడు మొదలయ్యే చైనా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో బరిలోకి దిగుతోంది.  మంగళవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన ఎవగెనియా కొసెత్స్‌కయాతో సింధు ఆడుతుంది. సింధు పార్శ్వంలోనే ప్రపంచ మాజీ చాంపియన్‌ ఒకుహారా (జపాన్‌), సుంగ్‌ జీ హున్‌ (కొరియా), హీ బింగ్‌జియావో (చైనా) ఉన్నారు. అనుకున్నట్లే ఫలితాలు వస్తే సింధు క్వార్టర్‌ ఫైనల్లో హీ బింగ్‌జియావోతో... ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌లో ఒకుహారాతో ఆడే అవకాశముంది. 
భారత్‌ శుభారంభం
మార్క్‌హ్యామ్‌ (కెనడా): ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో శ్రీలంకను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్‌–ధ్రువ్‌ కపిల; మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి– తనీషా క్రాస్టో; మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జూపూడి సృష్టి–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్‌ జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై విజయం సాధించగా... మహిళల సింగిల్స్‌లో మాళవిక; పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ తమ ప్రత్యర్థులను ఓడించారు.  

మరిన్ని వార్తలు