దుబాయి: తొలి టెస్టు విజయంతో ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఘనత సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కెరీర్లోనే అత్యుత్తమ (939) పాయింట్లు సాధించి టెస్టు ర్యాంకుల్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో అత్యదిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల సరసన చేరాడు. భారత్తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించడంతో స్మిత్కు ఆరు పాయింట్లు కలిసాయి. అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల లిస్టులో స్మిత్ ఆరోవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో బ్రాడ్మన్ (961), లెన్ హట్టన్ (945), జాక్ హబ్స్, రికీపాటింగ్లు (942), పీటర్ మే (941) పాయింట్లతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. వివి రిచర్డ్స్, సంగాక్కరల (938)ల స్థానాన్ని స్మిత్ అధిగమించాడు. భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించిన ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ 33 స్థానాలు అధగమించి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు 29 సాధించాడు.
ఈ ర్యాంకుల్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అశ్విన్, జడేజాలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కోహ్లి 873 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ బౌలర్, ఆల్రౌండర్గా అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా బౌలింగ్లో రెండవ ర్యాంకు, ఆల్రౌండర్లో మూడో ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ఇక తొలి టెస్టులో పర్వాలేదనిపించిన కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్లు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాహుల్ 11 ర్యాంకులు ఎగబాకి 46వ ర్యాంకు పొందాడు. యాదవ్ నాలుగు స్థానాలు అధగమించి 30వ ర్యాంకు సాధించాడు.