న్యూజిలాండ్‌పై భారత్‌ హ్యాట్రిక్‌

23 Jul, 2018 04:25 IST|Sakshi

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత పురుషుల జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. సిరీస్‌ను  3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్‌ 4–0తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. భారత్‌ తరఫున రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (8వ ని.లో), సురేందర్‌ కుమార్‌ (15వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (44వ ని.లో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (60వ ని.లో) ఒక్కోగోల్‌ చేశారు.

తొలి క్వార్టర్‌లో వచ్చిన రెండో పెనాల్టీ కార్నర్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రూపిందర్‌ భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించాడు. ఈ సిరీస్‌లో రూపిందర్‌కు ఇది నాలుగో గోల్‌ కావడం విశేషం. అనంతరం రూపిందర్‌ ఇచ్చిన పాస్‌ను ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ సురేందర్‌ గోల్‌ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మూడో క్వార్టర్‌లో వెటరన్‌ ప్లేయర్‌ సర్దార్‌ సింగ్‌ ఇచ్చిన చక్కటి పాస్‌ను మన్‌దీప్‌ గోల్‌గా మలిచాడు. మరి కొద్ది క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్‌ మరో గోల్‌తో భారత్‌కు విజయాన్నందించాడు.

మరిన్ని వార్తలు