న్యూజిలాండ్‌ జట్టులో భారత సంతతి ప్లేయర్‌  

26 Jul, 2018 01:01 IST|Sakshi

పాక్‌తో టెస్టు సిరీస్‌కు ఎజాజ్‌ పటేల్‌ 

వెల్లింగ్టన్‌: భారత్‌లో జన్మించిన స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ న్యూజిలాండ్‌ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరుగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఎజాజ్‌కు చోటు దక్కింది. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన మిచెల్‌ సాన్‌ట్నర్‌ స్థానంలో 29 ఏళ్ల ఎజాజ్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు తెలిపారు. ముంబైలో జన్మించిన ఎజాజ్‌ చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను గింగిరాలు తిప్పుతున్న ఎజాజ్‌ ఈ సీజన్‌లో 21.52 సగటుతో 48 వికెట్లు పడగొట్టాడు. అతనికి గతేడాది దేశవాళీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కింది. ‘సాన్‌ట్నర్‌ గాయంతో దూరమవడంతో ఫస్ట్‌ క్లాస్‌ ప్రదర్శన ఆధారంగా ఎజాజ్‌ను ఎంపిక చేశాం. గత రెండు సీజన్‌లుగా నిలకడైన ప్రదర్శన చేస్తుండటంతో అతనికి జట్టులో చోటు దక్కింది’ అని చీఫ్‌ సెలక్టర్‌ గావిన్‌ లార్సెన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు