కోట్లాభిషేకం

20 Dec, 2019 01:40 IST|Sakshi
ప్యాట్‌ కమిన్స్‌

ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌  కమిన్స్‌కు రూ. 15 కోట్ల 50 లక్షలు

సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మొత్తం పొందిన విదేశీ క్రికెటర్‌

మ్యాక్స్‌వెల్‌కు రూ. 10.75 కోట్లు

మోరిస్‌కు రూ. 10 కోట్లు   ముగిసిన లీగ్‌ వేలం

ఐపీఎల్‌ వేలంలో ఆ్రస్టేలియా క్రికెటర్ల పంట పండింది. ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ రికార్డు ధరతో కోల్‌కతా జట్టు చెంత చేరగా... మ్యాక్స్‌వెల్, కూల్టర్‌ నీల్, ఫించ్, స్టొయినిస్, క్యారీ, మిషెల్‌ మార్‌‡్షలకు కూడా భారీ మొత్తాలు లభించాయి. వన్డే ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌ కెపె్టన్‌ మోర్గాన్‌ను కూడా నైట్‌రైడర్స్‌ దక్కించుకోగా, మరో ఇంగ్లండ్‌ ఆటగాడు స్యామ్‌ కరన్‌ను చెన్నై సొంతం చేసుకుంది.

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌తో పాటు ‘సెల్యూట్‌’ కాట్రెల్, హెట్‌మైర్‌ పెద్ద మొత్తం దక్కించుకున్న ఇతర ఆటగాళ్లు. 73 స్థానాల కోసం 338 ఆటగాళ్లు పోటీ పడిన ఈ వేలంలో భారత అండర్‌–19 కుర్రాళ్లు కోటీశ్వరులుగా మారడం చెప్పుకోదగ్గ విశేషం. ఖాళీలు 73 ఉన్నా వేలంలో మాత్రం 62 మందినే తీసుకున్నారు.   

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 కోసం సాగిన వేలంలో ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు రికార్డు మొత్తం లభించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 15 కోట్ల 50 లక్షలకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి వేలంలో దక్కిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ రూ. 14 కోట్ల 50 లక్షలకు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను దక్కించుకోవడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ఓవరాల్‌గా మాత్రం 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు యువరాజ్‌ సింగ్‌కు ఇచి్చన రూ. 16 కోట్లు ఇప్పటికీ రికార్డుగానే ఉంది. రూ. 2 కోట్ల కనీస ధరతో కమిన్స్‌ కోసం వేలం మొదలైంది. ఈ దశ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) జట్లు అతని కోసం పోటీ పడి మొత్తాన్ని పెంచుతూ వెళ్లాయి.

ఆర్‌సీబీకి సొంతమైనట్లుగా అనిపించిన దశలో అనూహ్యంగా కోల్‌కతా బరిలోకి వచి్చంది. చివరకు అదే జట్టు ఆస్ట్రేలియా పేసర్‌ను గెలుచుకుంది. ‘వేలంలో అందుబాటులో ఉన్నవారిలో కమిన్స్‌ అత్యుత్తమ ఆటగాడు. గత కొన్నేళ్లలో అతను ఎంతో ఎదిగాడు. అతని ఆట అద్భుతంగా మారింది. అలాంటి క్రికెటర్‌ను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని కోల్‌కతా హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచ కప్‌ అందించిన ఉత్సాహం మీదున్న ఇయాన్‌ మోర్గాన్‌ను కూడా రూ. 5.25 కోట్లకు నైట్‌ రైడర్స్‌ దక్కించుకుంది. అయితే జట్టు కెప్టెన్‌గా మాత్రం దినేశ్‌ కార్తీక్‌ కొనసాగుతాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. గతంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున మెరుపులు మెరిపించిన మ్యాక్స్‌వెల్‌ను ఈ సారి అదే ఫ్రాంచైజీ రూ. 10.75 కోట్లకు దక్కించుకోవడం విశేషం.  

‘కమిన్స్‌ ఖుష్‌’
‘ఐపీఎల్‌ వేలంలో ప్యాట్‌ కమిన్స్‌ భారీ ధర పలకడం ఖాయం’... వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్య ఇది. అందుకు తగినట్లుగానే ఢిల్లీతో పాటు బెంగళూరు కూడా కమిన్స్‌ కోసం పోటీ పడ్డాయి. చివరకు ఈ రెండు జట్లు తప్పుకోగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) అతడిని సొంతం చేసుకుంది. గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌ ఆడని కమిన్స్‌ 2017లో 15 వికెట్లు పడగొట్టి ఢిల్లీ జట్టు తరఫున అగ్రస్థానంలో నిలిచాడు. నాటితో పోలిస్తే ఇప్పుడు కమిన్స్‌ బౌలింగ్‌ మరింత పదునెక్కింది. గతంలో గాయాలతో ఇబ్బంది పడిన అతను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా మారి ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న కమిన్స్, వన్డేల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

నిలకడగా 140 కిలో మీటర్లకు తగ్గని వేగంతో బౌలింగ్‌ చేసే కమిన్స్‌ జట్టులో ఉండటం ఏ జట్టుకైనా బలమే. ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి వికెట్‌ తీయగలిగితే ప్రత్యరి్థపై పైచేయి సాధించవచ్చు. కమిన్స్‌లో ఆ సత్తా ఉందని నమ్మిన నైట్‌రైడర్స్‌ భారీ మొత్తాన్ని వెచి్చంచింది. బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్లకు పెద్ద విలువ దక్కే ఐపీఎల్‌లో ఒక విదేశీ పేసర్‌కు రూ. 15 కోట్ల 50 లక్షలు ఇవ్వడం పెద్ద విశేషమే! కేకేఆర్‌ టీమ్‌లో ఇప్పటికే ఫెర్గూసన్, గరీ్న, ప్రసిధ్‌ కృష్ణ, శివమ్‌ మావి, కమలేశ్‌ నాగర్‌కోటి రూపంలో రెగ్యులర్‌ పేసర్లు ఉన్నారు. కమిన్స్‌ గతంలోనూ కోల్‌కతా తరఫున ఆడాడు. 2014–15 సీజన్లలో 4 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు పడగొట్టాడు.   

రూ.11.5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు...

ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా ఆడుతూ వేర్వేరు ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లలో ఇద్దరు భారత క్రికెటర్లకు మెరుగైన ధర పలికింది. రాబిన్‌ ఉతప్ప, జైదేవ్‌ ఉనాద్కట్‌లకు చెరో రూ. 3 కోట్లు ఇచ్చి రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. గత ఏడాది ఐపీఎల్‌ కోసం ఇదే రాజస్తాన్‌ జట్టు ఉనాద్కట్‌కు రూ.11.5 కోట్లు ఇచి్చన విషయం గమనార్హం. 2019 ఐపీఎల్‌ కోసం ‘మిస్టరీ స్పిన్నర్‌’ అంటూ పంజాబ్‌ జట్టు వరుణ్‌ చక్రవర్తికి ఏకంగా రూ. 8.4 కోట్లు చెల్లించి తీసుకుంది. అయితే ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన తర్వాత గాయంతో అతను సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు వరుణ్‌కు రూ. 4 కోట్లు (కోల్‌కతా) దక్కాయి.

అనూహ్యం!

వేలంలో చెన్నై జట్టు లెగ్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లాను రూ. 6.5 కోట్లకు కొనుక్కుంది. చావ్లా ఇటీవలి ఫామ్, అతను దేశవాళీలో సొంత జట్టు యూపీని వదిలి గుజరాత్‌కు ఆడుతున్న తీరును బట్టి చూస్తే ఈ మొత్తం ఆశ్చర్యకరం. అదీ ఎంతో లెక్కతో, జాగ్రత్తగా వేలంలో పాల్గొనే చెన్నై ఇలా ఎంచుకోవడం విశేషంగా అనిపించింది. అయితే నలుగురు విదేశీ ఆటగాళ్ల నిబంధనలో తాహిర్‌ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడంతో పాటు చెన్నై పిచ్‌ ఇటీవల మరీ నెమ్మదించడం కూడా కారణంగా కనిపిస్తోంది. అదే విధంగా గత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన, జాతీయ జట్టులో చోటు లేని విషయాలు చూసుకుంటే క్రిస్‌ మోరిస్‌కు కూడా ఆర్‌సీబీ రూ. 10 కోట్లు ఇవ్వడం చాలా ఎక్కువ!

వీరికి సారీ!

టి20 క్రికెట్‌లో గతంలో అద్భుతాలు చేసి ఇప్పుడు కళ తప్పినవారు కొందరైతే, మొదటి నుంచి పొట్టి క్రికెట్‌లో పెద్దగా గుర్తింపు లేనివారు మరికొందరు... అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్నా, ఐపీఎల్‌ వరకు వచ్చేసరికి అనామకులుగా కనిపించి ఎవరూ ఆసక్తి చూపించని ఆటగాళ్లు ఇంకొందరు... ఇలా ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన చెప్పుకోదగ్గ ఆటగాళ్ల జాబితాను చూస్తే... భారత టెస్టు జట్టు సభ్యులు చతేశ్వర్‌ పుజారా, హనుమ విహారిలకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ ఎంచుకోలేదు.

పుజారా టి20 బ్యాటింగ్‌పై మొదటి నుంచి ఎవరికీ నమ్మకం లేకపోగా, గత ఏడాది ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లకే పరిమితమైన ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారికి కూడా ఈసారి అవకాశం దక్కలేదు. ఒకప్పుడు విధ్వంసక ఆటగాడైన యూసుఫ్‌ పఠాన్, ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా ఆడిన గ్రాండ్‌హోమ్, భారత్‌పై తాజా పర్యటనలో చెలరేగుతున్న షై హోప్, కివీస్‌ రెగ్యులర్‌ ఆటగాళ్లు గప్టిల్, కొలిన్‌ మున్రోలను ఎవరూ పట్టించుకోలేదు. బంగ్లాదేశ్‌ ఆటగాడు ముషి్ఫకర్‌ కూడా అయ్యో పాపం అనిపించాడు. గతంలో ఎప్పుడూ ఐపీఎల్‌ ఆడని అతను ఈసారి వేలానికి ముందు తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత మనసు మార్చుకొని మళ్లీ వేలంలోకి వచ్చాడు. కానీ ఎవరూ అతనిపై ఆసక్తి చూపించలేదు. 14 ఏళ్ల అఫ్గాన్‌ కుర్రాడు నూర్‌ అహ్మద్‌ వైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు.

అండర్‌–19 బ్యాచ్‌ నుంచి ముగ్గురికి చోటు

త్వరలో జరిగే అండర్‌–19 ప్రపంచ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్న ఆటగాళ్లలో ముగ్గురికి ఐపీఎల్‌లో మంచి విలువ పలికింది. ప్రియమ్‌ గార్గ్‌ (సన్‌రైజర్స్‌–రూ.1.9 కోట్లు), యశస్వి జైస్వాల్‌ (రాజస్తాన్‌–రూ.2.4 కోట్లు), కార్తీక్‌ త్యాగి (రాజస్తాన్‌–రూ. 1.3 కోట్లు) అందుకోనున్నారు. రోడ్డుపై పానీపూరీలు అమ్మే స్థాయి నుంచి ముంబై సీనియర్‌ జట్టు వరకు ఎదిగిన సంచలన ఆటగాడు యశస్వికి భారీ మొత్తం లభించడం విశేషం.  

వేలం విశేషాలు
►48 ఏళ్ల ప్రవీణ్‌ తాంబేను కనీస ధర రూ. 20 లక్షలకు కోల్‌కతా జట్టు తీసుకుంది.
►దిగ్గజ పేసర్‌ స్టెయిన్‌ రెండు సార్లు వేలానికి వచి్చనా ఎవరూ పట్టించుకోలేదు. మూడోసారి వేలంలో అతడిని కనీస ధర రూ. 2 కోట్లకు బెంగళూరు ఎంచుకుంది.  
►కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు కెపె్టన్‌గా లోకేశ్‌ రాహుల్, బ్యాటింగ్‌ కోచ్‌గా వసీమ్‌ జాఫర్‌ వ్యవహరిస్తారని ఫ్రాంచైజీ ప్రకటించింది.  
►ఫించ్‌కు ఐపీఎల్‌లో బెంగళూరు ఎనిమిదో జట్టు కావడం విశేషం. గతంలో అతను ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ముంబై, పుణే, రాజస్తాన్, హైదరాబాద్‌ జట్లకు ఆడాడు. ‘ఐపీఎల్‌ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండేందుకు న్యూజిలాండ్‌తో మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటావని ఆశిస్తున్నా.’  –కమిన్స్‌ను ఉద్దేశించి మెకల్లమ్‌ ట్వీట్‌

వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా
చెన్నై సూపర్‌ కింగ్స్‌
►పీయూశ్‌ చావ్లా    రూ. 6.75 కోట్లు
►స్యామ్‌ కరన్‌    రూ. 5.5 కోట్లు
►హాజల్‌వుడ్‌    రూ. 2.0 కోట్లు
►సాయికిశోర్‌    రూ. 20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌
►హెట్‌మైర్‌    రూ. 7.75  కోట్లు 
►స్టొయినిస్‌    రూ. 4.8 కోట్లు
►అలెక్స్‌ క్యారీ    రూ. 2.4 కోట్లు
►జేసన్‌ రాయ్‌    రూ. 1.5 కోట్లు
►క్రిస్‌ వోక్స్‌    రూ. 1.5 కోట్లు
►మోహిత్‌ శర్మ    రూ. 50 లక్షలు
►తుషార్‌ దేశ్‌పాండే    రూ. 20 లక్షలు
►లలిత్‌ యాదవ్‌    రూ. 20 లక్షలు

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌
►మ్యాక్స్‌వెల్‌    రూ. 10.75 కోట్లు
►కాట్రెల్‌    రూ. 8.5 కోట్లు
►క్రిస్‌ జోర్డాన్‌    రూ. 3.0 కోట్లు
►రవి బిష్ణోయ్‌    రూ. 2.0 కోట్లు
►ప్రభుసిమ్రన్‌ సింగ్‌    రూ. 55 లక్షలు
►దీపక్‌ హుడా    రూ. 50 లక్షలు
►జేమ్స్‌ నీషమ్‌    రూ. 50 లక్షలు
►తజిందర్‌ ధిల్లాన్‌    రూ. 20 లక్షలు
►ఇషాన్‌ పోరెల్‌    రూ. 20 లక్షలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
►ప్యాట్‌ కమిన్స్‌    రూ. 15.5 కోట్లు
►మోర్గాన్‌    రూ. 5.25 కోట్లు
►వరుణ్‌ చక్రవర్తి    రూ. 4.0 కోట్లు
►టామ్‌ బాంటన్‌    రూ. 1.0 కోట్లు
►రాహుల్‌ త్రిపాఠి    రూ. 60 లక్షలు
►క్రిస్‌ గ్రీన్‌    రూ. 20 లక్షలు
►నిఖిల్‌ శంకర్‌     రూ. 20 లక్షలు
►ప్రవీణ్‌ తాంబే    రూ. 20 లక్షలు
►సిద్ధార్థ్‌    రూ. 20 లక్షలు

ముంబై ఇండియన్స్‌
►కూల్టర్‌నీల్‌    రూ. 8.0 కోట్లు
►క్రిస్‌ లిన్‌    రూ. 2.0 కోట్లు
►సౌరభ్‌ తివారీ    రూ. 50 లక్షలు
►దిగి్వజయ్‌ దేశ్‌ముఖ్‌    రూ. 20 లక్షలు
►ప్రిన్స్‌ బల్వంత్‌రాయ్‌     రూ. 20 లక్షలు
►మోహ్‌సిన్‌ ఖాన్‌    రూ. 20 లక్షలు

రాజస్తాన్‌ రాయల్స్‌
►రాబిన్‌ ఉతప్ప    రూ. 3.0 కోట్లు
►జైదేవ్‌ ఉనాద్కట్‌    రూ. 3.0 కోట్లు
►యశస్వి జైస్వాల్‌    రూ. 2.4 కోట్లు
►కార్తీక్‌ త్యాగి    రూ. 1.3 కోట్లు
►టామ్‌ కరన్‌    రూ. 1.0 కోట్లు
►ఆండ్రూ టై    రూ. 1.0 కోట్లు
►అనుజ్‌ రావత్‌     రూ. 80 లక్షలు
►డేవిడ్‌ మిల్లర్‌    రూ. 75 లక్షలు
►ఒషానే థామస్‌    రూ. 50 లక్షలు
►అనిరుధ అశోక్‌ జోషి    రూ. 20 లక్షలు
►ఆకాశ్‌ సింగ్‌    రూ. 20 లక్షలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
►క్రిస్‌ మోరిస్‌    రూ. 10.0 కోట్లు
►ఆరోన్‌ ఫించ్‌    రూ. 4.4 కోట్లు
►కేన్‌ రిచర్డ్‌సన్‌    రూ. 4.0 కోట్లు
►స్టెయిన్‌    రూ. 2.0 కోట్లు
►ఇసురు ఉదాన    రూ. 50 లక్షలు
►షాబాజ్‌ అహ్మద్‌    రూ. 20 లక్షలు
►జోషువా ఫిలిప్‌    రూ. 20 లక్షలు
►పవన్‌ దేశ్‌పాండే    రూ. 20 లక్షలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
మిచెల్‌ మార్ష్‌    రూ. 2.0 కోట్లు
►ప్రియమ్‌ గార్గ్‌    రూ. 1.9 కోట్లు
►విరాట్‌ సింగ్‌    రూ. 1.9 కోట్లు
►ఫాబియాన్‌ అలెన్‌    రూ. 50 లక్షలు
►బావనాక సందీప్‌    రూ. 20 లక్షలు
►సంజయ్‌ యాదవ్‌    రూ. 20 లక్షలు
►అబ్దుల్‌ సమద్‌    రూ. 20 లక్షలు


మ్యాక్స్‌వెల్‌ రూ. 10.75 కోట్లు

మోరిస్‌ రూ. 10 కోట్లు

కాట్రెల్‌ రూ. 8.50 కోట్లు

కూల్టర్‌ నీల్‌ రూ. 8 కోట్లు

హెట్‌మైర్‌ రూ. 7.75 కోట్లు

మరిన్ని వార్తలు