పరుగులో బోల్ట్‌ను మరిపిస్తున్నాడు..!

18 Aug, 2019 11:36 IST|Sakshi

భోపాల్‌: ఉసేన్‌ బోల్ట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్‌లో దిగాడంటే చిరుత కంటే వేగంగా దూసుకుపోతాడు ఈ జమైకా అథ్లెట్‌.  ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న బోల్ట్‌ అంటే చాలామంది అథ్లెట్లకు ఆదర్శం. కాగా, మనకు ఓ బోల్డ్‌ దొరికినట్లే కనబడుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రామేశ్వర్‌(19)కు పరుగు అంటే విపరీతమైన ఆసక్తి. అదే సమయంలో పరుగులో మంచి నైపుణ్యం కూడా ఉంది. ఇప్పుడు అతనే పరుగే ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి వెళ్లడం, అక్కడి నుంచి అది కాస్తా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజుజు వరకూ వెళ్లడం జరిగాయి.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన రామేశ్వర్ అనే యువకుడికి రన్నింగ్‌లో మంచి ప్రతిభ ఉంది. ఈ క్రమంలో అతడు కనీసం చెప్పులు కూడా లేకుండా 100మీటర్ల పరుగును 11 సెకన్లలో చేధించే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారి మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో చౌహాన్‌ ఆ వీడియోను ట్విటర్‌లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌రిజుజుకి ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. ‘ భారత్‌లో వ్యక్తిగత నైపుణ్యానికి కొదవలేదు. వారికి సరైన వేదిక దొరికినప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. పరుగుపందెంలో ఈ యువకుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఒకవేళ మంచి సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే దేశానికి పేరు తీసుకురాగలడన్నా నమ్మకం ఉంది’ అని పేర్కొటూ రిజుజుకి ట్యాగ్‌ చేశారు.  

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ను చూసిన కిరణ్‌రిజుజు ఫిదా అయిపోయారు. అందుకు కిరన్‌ రిజుజు స్పందిస్తూ..  ‘అతడిని ఎలాగైనా నా వద్దకు పంపించండి, తప్పకుండా అతడిని అథ్లెటిక్స్‌ అకాడమీలో చేర్పించి ఇంకా మెరుగయ్యేలా మంచి శిక్షణ ఇప్పిస్తా’ అని హామీ ఇచ్చారు. అతనికి మంచి శిక్షణ దొరికి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు