ప్లే ఆఫ్‌కు భారత్

17 Apr, 2015 02:16 IST|Sakshi

మలేసియాపై ఘన విజయం
ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నీ

 
సాక్షి, హైదరాబాద్ : ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో భారత జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో మలేసియాను చిత్తు చేసింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన మొదటి సింగిల్స్‌లో ప్రార్థనా తోంబరే 6-1, 6-0తో నబీలా బిన్తిని చిత్తు చేసింది. రెండో సింగిల్స్ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకితా రైనా 6-1, 3-6, 6-4తో జవైరియా నూర్‌దిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఏకంగా 2 గంటల 18 నిమిషాల పాటు సాగింది. డబుల్స్‌లో కూడా భారత్‌దే పైచేయి అయింది. ప్రార్థన-నటాషా జోడి 6-0, 6-2తో సెల్వరజూ-నబీలా బిన్తి జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కూడా సానియా మీర్జా బరిలోకి దిగలేదు.

భారత్ ప్రత్యర్థి తుర్క్‌మెనిస్తాన్
మరో వైపు ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, తుర్క్‌మెనిస్తాన్ జట్లు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఇండోనేసియా 3-0తో శ్రీలంకపై, తుర్క్‌మెనిస్తాన్ 3-0తో కిర్గిస్తాన్‌పై గెలుపొందాయి. సింగపూర్‌పై గెలిచి గ్రూప్ ‘ఎ’ నుంచి ఫిలిప్పీన్స్ తొలి రోజే ప్లే ఆఫ్ చేరింది.  శుక్రవారం జరిగే తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తుర్క్‌మెనిస్తాన్‌తో భారత్... మరో మ్యాచ్‌లో ఇండోనేసియాతో ఫిలిప్పీన్స్ తలపడతాయి.

మరిన్ని వార్తలు