ఏడు నెలల తర్వాత బరిలోకి...

5 Feb, 2018 05:04 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో నేడు భారత మహిళల జట్టు తొలి వన్డే   

కింబర్లీ: గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టు ఏడు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ బరిలోకి దిగుతోంది. సఫారీ పర్యటనలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సోమవారం ఇక్కడ జరుగనుంది. 2021లో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సంపాదించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు ఇది చక్కని అవకాశం. ఏడు నెలల క్రితం వీరోచిత ప్రదర్శనతో ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన మిథాలీ రాజ్‌ సేనకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది.

ఇప్పుడు తాజాగా బరిలోకి దిగేందుకు ఈ విరామం దోహదం చేస్తుంది. ఇక ఇప్పటి నుంచి తమకు ప్రతీ మ్యాచ్‌ పరీక్షలాంటిదేనని భారత సారథి మిథాలీ తెలిపింది. క్రికెట్‌ ప్రేమికులు ఇప్పుడు మహిళల ఆటపై కూడా ఆసక్తి పెంచుకున్నారని చెప్పింది. సఫారీ గడ్డపై కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ సహచర క్రీడాకారిణిలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పింది. ఈ జట్టులో 17 ఏళ్ల ముంబై విద్యార్థిని జెమీమా రోడ్రిగ్స్‌ ప్రధానాకర్షణ కానుంది. దేశవాళీ క్రికెట్లో అమె అసాధారణ ఫామ్‌తో ఏకంగా సీనియర్‌ జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు సఫారీ పిచ్‌లపై ఆమె ఏమేరకు రాణిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. 

మరిన్ని వార్తలు