అదిరిన భారత బాక్సర్ల పంచ్‌

25 Jun, 2019 06:15 IST|Sakshi

బ్లాక్‌ ఫారెస్ట్‌ కప్‌లో ఏడు పతకాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత బాక్సర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా జర్మనీలో జరిగిన బ్లాక్‌ ఫారెస్ట్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత జూనియర్‌ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం ఏడు పతకాలు గెల్చుకొని టోర్నమెంట్‌లో ఉత్తమ జట్టు అవార్డును సొంతం చేసుకున్నారు. భారత్‌ నెగ్గిన ఏడు పతకాల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, లాత్వియా, హంగేరి, లిథువేనియా, మంగోలియా, గ్రీస్, పోలాండ్‌ దేశాలు కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌ తరఫున 13 మంది బాక్సర్లు బరిలోకి దిగారు. భారత్‌ తరఫున తమన్నా (48 కేజీలు), అంజు (50 కేజీలు), నేహా (54 కేజీలు), అంబేషోరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. ఫైనల్లో ఓడిన తన్ను (52 కేజీలు), ఆశ్రేయ (63 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.   

మరిన్ని వార్తలు