భారత బాలికలకు మరో ఓటమి

20 Apr, 2019 16:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా ఫెడ్‌కప్‌ టోర్నమెంట్‌లో భారత బాలికల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. 9 నుంచి 16 స్థానాల కోసం జరుగుతున్న వర్గీకరణ మ్యాచ్‌ల్లో భాగంగా మలేసియాతో శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో భారత్‌ 1–2తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల 6–0, 6–0తో జె జువాన్‌ లిమ్‌ (మలేసియా)ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో సంజన ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం.

అయితే రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన భక్తి షా 2–6, 6–3, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో షరీఫా ఎల్సా (మలేసియా) చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమం అయ్యింది. నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో సంజన–సుదీప్త ద్వయం 3–6, 6–3, 6–10తో షరీఫా ఎల్సా–జాన్‌ నింగ్‌ లిమ్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. నేడు జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ ఆడుతుంది.

>
మరిన్ని వార్తలు