సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ 3–2తో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి (6వ నిమిషంలో), రాణి రాంపాల్ (27వ ని.లో), గుర్జీత్ కౌర్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
కొరియా జట్టుకు యురిమ్ లీ (10వ ని.లో), జంగ్జియున్ సియో (31వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ గురువారం జరుగుతుంది.