‘డ్రా’తో ముగించారు

1 Feb, 2019 09:05 IST|Sakshi

ముర్సియా (స్పెయిన్‌): తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న స్పెయిన్‌ జట్టుపై వారి దేశంలోనే సిరీస్‌ గెలిచే అవకాశాన్ని భారత మహిళల జట్టు చేజార్చుకుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ భారత్‌ 1–1తో ముగించింది. సిరీస్‌లోని చివరిదైన నాలుగో మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’ అయ్యింది. ఆట 8వ నిమిషంలో దీప్‌ ఎక్కా గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 26వ నిమిషంలో నవనీత్‌ కౌర్‌ గోల్‌తో భారత ఆధిక్యం 2–0కు చేరింది. అయితే మూడో క్వార్టర్‌లో భారత్‌ నాలుగు నిమిషాల తేడాలో రెండు గోల్స్‌ సమర్పించుకుంది. ప్రపంచ ఏడో ర్యాంకర్‌ స్పెయిన్‌ జట్టు తరఫున 35వ నిమిషంలో లూసియా జెమినెజ్‌... 39వ నిమిషంలో క్లారా వైకార్ట్‌ ఒక్కో గోల్‌ చేసి స్కోరును 2–2తో సమం చేశారు. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయాయి. తొలి మ్యాచ్‌లో భారత్‌ 2–3తో ఓడిపోగా... రెండో మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’ అయ్యింది. మూడో మ్యాచ్‌లో భారత్‌ 5–2తో గెలిచిన విషయం తెలిసిందే.  

>
మరిన్ని వార్తలు