భారత మహిళల జోరు

3 Mar, 2016 00:56 IST|Sakshi
భారత మహిళల జోరు

 వరుసగా ఐదో విజయంతో ‘టాప్’  ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్
 
కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు విజయపరంపర కొనసాగుతోంది. రెండో డివిజన్ గ్రూప్ ‘జి’లో భారత్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో క్రొయేషియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మనిక బాత్రా 11-8, 12-10, 8-11, 11-6తో లియా రకోవాపై, రెండో సింగిల్స్‌లో మౌమా దాస్ 13-11, 9-11, 11-8, 11-2తో యువాన్ తియాన్‌పై, మూడో సింగిల్స్‌లో షామిని 14-12, 11-8, 7-11, 11-3తో ఇవానాపై నెగ్గారు.

ఆరు జట్లు ఉన్న ఈ గ్రూప్‌లో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక భారత్ 25 నుంచి 28 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి డివిజన్‌లో ఉన్న జట్లు మాత్రం చాంపియన్‌షిప్ కోసం పోటీపడతాయి. మరోవైపు భారత పురుషుల జట్టు రెండో డివిజన్ గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచింది. చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో స్లొవేకియాపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో సౌమ్యజిత్ ఘోష్, రెండో సింగిల్స్‌లో శరత్ కమల్, మూడో సింగిల్స్‌లో హర్మీత్ దేశాయ్ 11-7, 11-6, 11-6తో అలెగ్జాండర్ వలూచ్‌పై గెలిచారు.

మరిన్ని వార్తలు